15, నవంబర్ 2008, శనివారం

వార్తలు

చర్లపల్లి జైలుపై నిర్లక్ష్యం క్రీనీడ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కేంద్ర కారాగారాల పని తీరుపై విమర్శలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా చర్లపల్లి జైలు కేంద్ర కారాగారంలో జరుగుతున్న కార్యక్రమాలపై, జైలు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో సంచలనం కలిగించిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్యకు చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే పథకాన్ని రూపొందించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. పరిటాల రవి హత్యకు ముమ్దు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను పలుమార్లు చర్లపల్లి జైలుకి వచ్చి ములాఖాత్ లో సూరిని కలిసినట్లు వచ్చిన వార్తలు సంచలనం కలిగించాయి. కాగా అనంతపురం జిల్లా జైలులో మొద్దు శీను హత్యకు గురి కావడం, చర్లపల్లి కేంద్ర కారాగారంలో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలపై సర్వత్రా విమర్శలు తలెత్తడం జైళ్ళ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ములాఖాత్ విషయంలో జైలు సిబ్బంది, అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పలువురు ఖైదీలు ఆరోపిస్తున్నారు. జైల్లో రహస్యంగా గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఖైదీలకు గంజాయి ఎక్కడ నుండి వచ్చిందో అధికారులు చెప్పడం లేదు. గత కొంతకాలం కిందట ఓ జైలర్, సిబ్బంది ఓ ఖైదీపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డంతో ఆ ఖైదీ మృత్యువాత పడ్డాడు. జైల్లో ఖైదీల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారులను షాక్ గురి చేస్తూ ఓ ఖైదీ టవర్ పైనుండి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన విషయంలో భద్రత ఎంత గొప్పగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా కొద్ది రోజుల క్రితం జరిగిన గీతాగోవిందం కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర హోంమంత్రి సమక్షంలోనే జైలు అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇవే కాదు ఇలాంటి సంఘటనలెన్నింటికో చర్లపల్లి జైలు కేంద్రబిందువుగా మారింది.వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే...
1) చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూరి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జైల్లోనే పథక రచన చేసేవాడని ఆరోపణలున్నాయి.
2) ఐదు సంవత్సరాల క్రితం చర్లపల్లి జైల్లో బిర్యానీ ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి. ఈ సంఘటన బయటకు పొక్కడంతో పలువురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
3) మద్దెల చెర్వు సూర్యనారాయణ (సూరి)తో మొద్దు శీను సన్నిహితంగా ఉన్నంతకాలం చర్లపల్లి జైలు సంచలనాలకు నిలయంగా మారింది. అక్కడే శిక్ష అనుభవించినంత కాలం జైలు అధికారులతో కలిసి భూవివాదాలు, సెటిల్ మెంట్లు చేయడం వంటివి అందరికీ ఆందోళన కలిగించాయి.
4) చర్లపల్లి కేంద్ర కారాగారంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ జైలర్ శ్రీనివాస్ నాయక్ ను శీను భూవివాదాలు, సెటిల్ మెంట్లకు వినియోగించుకున్నాడన్న ఆరోపణలతో అతనిపై చర్యలు తీసుకున్నారు.
5) జైల్లోని అధికారుల అండదండలతో సూరితో బాటు శీను యధేచ్చగా సెల్ ఫోన్లు వినియోగించడంపై పలు ఆరోపణలు వచ్చాయి.
6) మొద్దు శీనుకు జైలు అధికారులతో బాటు ఇక్కడ డాక్టర్ గా పని చేసిన సాంబశివరావుకు సంబందించిన సెల్ ఫోన్ వినియోగించుకునేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.( ఆ సాంబశివరావు రైల్లో ప్రయాణిస్తూ అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మరణించాడు)
7) మొద్దు శీనుకు తన బావమరిది వరుస అయ్యే వెంకట రెడ్డి జైల్లోకి సెల్ ఫోన్ విసిరే ప్రయత్నం కేసులో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
8) జైల్లో అధికారులు కావాల్సిన వారికి విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని పలుమార్లు ఖైదీలు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యం.
9) ములాఖత్ విషయంలో సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని ఖైదీల బంధువులు కూడా ఆరోపిస్తున్నారు.
10) అవసరమైన వారికి బిర్యానీ ప్యాకెట్లు అందిస్తూ మిగిలిన ఖైదీల ఆహార విషయంలో పోషక విలువల ఆహారం, మంచినీరు అందించడం లేదనీ, సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తునాయి. ఇది కేవలం ఒక్క చర్లపల్లి కేంద్ర కారాగార పరిస్థితి మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న చాలా జైళ్ళలో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది. జైళ్ళలో ఉన్న ఖైదీలకు సౌకర్యాలు కల్పించి, వారిలో మార్పు తీసుకురావాల్సిన జైళ్ళు నరకాలకు నకళ్ళుగా మారుతున్నాయి. ఈ విషయంపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకప్పుడు క్రూర స్వభావం గల నేరస్తులు, కరడు కట్టిన తీవ్రవాదుల వంటి వారిని ఉంచే తీహార్ జైలు అంటే ఇప్పటి వరకూ జనం భయపడేవారు, కానీ ఇప్పుడు జరుగుతున్నసంఘటనలను చూసి చిన్నజైళ్ళన్నా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది

11, నవంబర్ 2008, మంగళవారం

తెలుగుకు ప్రాచీన హోదా

తెలుగుకు 'ప్రాచీన' వెలుగు
నవంబర్ 1 వ తేదీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం తెలుగుప్రజలకు అరుదైన బహుమతిని అందించింది. తేనెలొలుకు తీయని తెలుగుకు ప్రాచీన హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ నేతృత్వంలోని భాషానిపుణుల సంఘం చేసిన సిఫారసును ఆమోదిస్తున్నట్లు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అంబికా సోనీ వెల్లడించారు.తొమ్మిదిమందితో కూడిన నిపుణుల సంఘంలో ఎనిమిది మంది తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా కల్పించాలని సిఫారసు చేశారు. తమిళనాడుకు చెందిన కొళందెస్వామి మాత్రం నిరసన వ్యక్తం చేసారు. అయితే దీనిపై మద్రాస్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో తీర్పు వెలువడ్డాకే తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదాకు సంబందించిన విషయం అమల్లోకి వస్తుందని అంబికాసోనీ తెలిపారు.
ప్రాచీన హోదాతో లాభం !
తెలుగు, కన్నడ భాషలు 1500సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్లు గుర్తించి ప్రాచీన హోదా కల్పించారు. దీనివలన ఈ భాషలకు పలు అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ భాషలలోని రచనలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఈ భాషల ప్రతిభా కేంద్రాలను నెలకొల్పే అవకాశముంది. యుజిసితో బాటు వివిధ పరిశోధనా సంస్థల నుండి, యూనివర్శిటీల నుండి గ్రాంటులు లభిస్తాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక పీఠాలు నెలకొల్పుతారు. భాషా సుసంపన్నానికి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ద్వారా పలు రకాల సదుపాయాలు, గ్రాంట్లు పొందవచ్చు. రాష్ట్రప్రభుత్వాలు, వ్యక్తులు, విద్యాసంస్థలు ఈ గ్రాంట్లు పొందే అవకాశం ఉంది.
తెలుగు భాషా అభివృద్ధి సంఘం కృషి...
తెలుగుభాషకు ప్రాచీన హోదా దక్కడంలో రాష్ట్రప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ కీలకపాత్ర వహించిందని చెప్పవచ్చు. ఇందులో సభ్యులైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, ఏబికే ప్రసాద్ తదితరులు ఎంతగానో కృషి చేసి, పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. వాస్తవానికి ఇతర భాషలకు ప్రాచీన హోదా రాకుండా ఉండేందుకు తమిళులు ఎంతగానో ప్రయత్నించారు. భాషానిపుణుల సంఘంలోని తమిళ సభ్యులు కొళందెస్వామి, కణ్ణన్ ప్రతిఘటించినప్పటికీ రాష్ట్రానికి చెందిన నిపుణులు భద్రిరాజు కృష్ణమూర్తి, సుబ్బారావు, మైసూరు భారతీయ భాషల సంస్థకు చెందిన ఉదయ్ నారాయణ్ సింగ్ తదితరులు తెలుగు, కన్నడ భాషలకు అనుకూలంగా వాదించారు. తమిళ భాషకు ప్రాచీన హోదా లభించినప్పుడు వెయ్యి సంవత్సరాల ప్రాతిపదిక మాత్రమే ఉండేది. అనంతరం మిగిలిన భాషలకు ఆ హోదా దక్కకుండా ప్రయత్నించారు. రెండు వేల సంవత్సరాల వయసున్న భాషలకు మాత్రమే ప్రాచీన హోదా కల్పించాలంటూ అప్పటి కేంద్రమంత్రి దయానిధిమారన్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పదిరోజుల్లోనే కేంద్రం తన నిర్ణయం మార్చుకొంది. 1500నుండి 2000 సంవత్సరాల లోపు ప్రాచీనత ఉన్న భాషకు ఈ హోదా కల్పించాలని 2004 అక్టోబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ విచిత్రమేమిటంటే తమిళ భాషకు ప్రాచీన హోదా కల్పించిన తర్వాతే అత్యంత పురాతనమైన సంస్కృతానికి ఆ హోదా కల్పించాలని కేంద్రం నిర్ణయించడం! ఒకవైపు దయానిధి మారన్, చిదంబరం వంటి కేంద్ర మంత్రులు మరో వైపు నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్న తమిళ సాహిటీవేత్త కొళందెస్వామి ఇతర భాషలకు ప్రాచీన హోదా కల్పించకుండా అడ్డం పడుతూ వచ్చారు. చివరకు నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోకుండా అడ్డుపడేందుకు మద్రాసు హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. అయినా ఇన్ని అవాంతరాల మధ్య నాలుగేళ్ళ పోరాటం తర్వాత తెలుగుభాషాభిమానుల కల నెరవేరింది. 'ఈస్ట్ ఆఫ్ ఇటాలియన్' గా పిలుచుకునే తెలుగుకు ప్రాచీన హోదా లభించింది

9, నవంబర్ 2008, ఆదివారం

రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో జత కట్టేనో...
ఎన్నికల గడువు సమీపిస్తున్నా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులకు మాత్రం దూరం పెరుగుతోంది. ఒకరిపై మరొకరు పరోక్షంగా ఒత్తిడి పెంచుకునే వ్యూహంలో భాగంగా ఏ ఒక్క పార్టీ ఇంతవరకూ పొత్తులను ఖరారు చేసుకోలేకపోయింది. ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న అనైక్యత పొత్తులపై అనిశ్చితి అధికార కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతానికి లాభసాటిగా పరిణమించింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల పొత్తులు మాటలకే పరిమితమవుతున్నాయి. 2004 ఎన్నికలకు ముందు నాటికి, ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజా అంకితయాత్ర యాత్ర తరువాతే పొత్తుల గురించి ఆలోచిస్తామని ప్రకటించింది.
ఒంటరిగా కాంగ్రెస్...
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని అధికారం పొందిన కాంగ్రెస్ వాటిని మెల్లమెల్లగా దూరమౌతూ వస్తోంది. ఈ సారి కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగనుంది. మజ్లిస్ పార్టీతో పొత్తు అని చెప్పకపోయినా పరస్పర అవగాహన ఉంటుంది. అయినా టీఆర్‌ఎస్‌తో కలిస్తే తమకు అనుకూలిస్తుందని కొందరి నేతల్లో ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వ్యతిరేక ఓటుతో టీడీపీ...

తెలుగుదేశం పార్టీలో తమతో ఎవరు కలిసి వస్తారో తెలియని అయోమయం కనిపిస్తోం ది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పొత్తు కోసమే తమ పార్టీ తెలంగాణకు అనుకూలమే అని ప్రకటించింది. అయితే చివరి సమయంలో తమను వదిలిపెట్టి, పీఆర్పీ వైపు చూస్తుండడం టీడీపీని కలవరపరుస్తోంది. టీఆర్‌ఎస్‌తో కలిసి నడిస్తే తెలంగాణలో తనకు ఎదురుండదని భావించిన టీడీపీకి, ఆ పార్టీ ద్విముఖ వ్యూహం అంతుపట్టకుండా ఉంది. అదేవిధంగా సీపీఐ కూడా తమతోనే కలిసిరావాలని కోరుకుంటుండగా ఆ పార్టీ మాత్రం పీఆర్పీ వైపు వెళ్లాలని భావిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సీపీఐ పార్టీ చిరుపార్టీతో కలిస్తే కాంగ్రెస్‌ లాభపడుతుందన్న వాదనతో చంద్రబాబు నాయుడు, సీపీఐ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఏటూ తేల్చని పీఆర్పీ...
కీలకమైన రాజకీయపార్టీగా భావిస్తున్న ప్రజారాజ్యం పార్టీ రానున్న ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీచేస్తుందన్న ఉత్కంఠ మిగిలిన పార్టీల శ్రేణుల్లో కనిపిస్తోంది. నామమాత్రపు క్యాడర్‌ ఉన్న తెలంగాణలో సైతం చిరంజీవి యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో తెలంగాణ యాత్రకు ముందు పొత్తులు పెట్టుకోవాలన్న నిర్ణయంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. తమది కొత్త పార్టీ కాబట్టి, తాము అడిగినన్ని సీట్లు ఇస్తారన్న ఆశతోనే టీఆర్‌ఎస్‌, సీపీఐ వంటి పెద్ద పార్టీలు తమతో పొత్తు కోసం పాకులాడుతున్నట్లు పీఆర్పీ నాయకత్వం అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఆ రెండు పార్టీలతో కలవడం కన్నా ఇచ్చిన సీట్లతో సర్దుకుపోయే నవ తెలంగాణ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉండవచ్చని తెలుస్తోంది.
భంగపడ్డ టీఆర్‌ఎస్...
ఈ ఎన్నికల్లో ద్విముఖ వ్యూహం అనుసరించి, ఏక కాలంలో రెండు పెద్ద పార్టీలతో లాభదాయకమైన సీట్ల బేరం ఆడాలన్న టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడ దారుణంగా దెబ్బతీసేలా కనిపిస్తోంది. ముందు టీడీపీ నాయకత్వంతో రాయబారాలు నడిపి, తెలంగాణకు జై కొట్టించిన టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆ తర్వాత పీఆర్పీ నేత చిరంజీవి ఉత్తరాంధ్ర పర్యటన దిగ్విజయం కావడం, ఆ పార్టీలోకి వలసలు పెరుగుతుండడంతో వైఖరి మార్చుకోవడం చర్చనీయాంశమయింది. అంతలోనే ప్రజా అంకిత యాత్రలో చిరంజీవిపై టీఆర్‌ఎస్‌ నాయకులు కోడిగుడ్లతో దాడి చేయడం ఆ పార్టీకి మాయని మచ్చలా మారింది. సామాజిక తెలంగాణ అన్నందుకే తమ అధినేతపై దాడి జరిగిందని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దూరంగా పెట్టాలని పీఆర్పీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ కూడా పీఆర్పీతో ఎన్నికల పొత్తు ఉండదని, ఈ సారి చిరును తెలంగాణలో అడుగుపెట్టనీయబోమంటూ హెచ్చరించడం బట్టి మాటలతో ఈ పార్టీల మధ్య ఆగాధం పెరగినట్లు కనిపిస్తోంది.
ఐక్యత లేని వామపక్షాలు...
అసలు వామపక్షాల మధ్యే ఐక్యత లేకపోవడం ఈ రెండు పార్టీలు చివరికు ఎటువెళ్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. సీపీఎం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో కలిసి వెళ్లాలని ఇప్పటికే దాదాపుగా నిర్ణయిం చుకోగా, సీపీఐ మాత్రం పీఆర్పీతో పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తోంది. పైకి వామపక్షలు రెండూ తాము కలిసే పోటీ చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, వాటి భావాలు మాత్రం పరస్పర విరుద్ధంగా కనిపి స్తున్నాయి. అయితే బయటకు మాత్రం వామపక్ష ఐక్యత పేరిట హడావిడి, కలిసే పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఆ రెండు ఎవరితో వెళ్లాలన్న అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి.

1, నవంబర్ 2008, శనివారం

ram